ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం మంది మహిళలు నిత్యం మగవారి చేతిలో ఏదో ఒకరకంగా వేదనకు గురవుతున్నట్లు ప్రపంచ నివేదికలు తెలుపుతున్నాయి. వీరిలో కొంతమంది మౌన రోదనతోనే జీవిస్తుంటే, మరికొంతమంది తిరగబడుతూ స్వేచ్ఛా జీవనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇలా మగాళ్లు పెత్తనం చెలాయించే ఈ ప్రపంచంలో కొన్ని వూళ్లు మాత్రం స్త్రీల అధీనంలోనే ఉన్నాయని మీకు తెలుసా ? అక్కడ మగవారు అడుగుపెట్టడానికి వీల్లేదంటే మీరు నమ్ముతారా ? అవును ఇది నిజమే ! మన ప్రపంచంలో ఇటువంటి ఊళ్లు కూడా కొన్నున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం రండి !

15 మందితో మొదలైంది !
ఉత్తర కెన్యాలోని సంబురులో పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది ఉమోజ అనే ఊరు. చుట్టూ ముళ్లపొదతో రక్షణ వలయం కలిగిన ఈ ఊరిలోకి మగవారికి ప్రవేశం నిషిద్ధం. 1990లో బ్రిటిషర్ల చేతిలో అత్యాచారానికి గురైన 15 మంది మహిళలు ఈ ఊరిని నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. చుట్టు పక్కల ఊర్లలో మగవారి వల్ల చిత్రహింసలకు గురైన దాదాపు 50 మంది మహిళలకి, 200 మంది పిల్లలకు ప్రస్తుతం ఈ ఊరు నీడనిస్తోంది. వీరిలో పశువుల కోసం వృద్ధులకు అమ్మేసిన అమ్మాయిలు, పురుషుల చేతిలో అఘాయిత్యానికి గురైతే ఇంట్లో నుండి గెంటేసిన గృహిణులు ఉన్నారు.
జీవనాధారం కోసం ఇక్కడి మహిళలు పశువులను కాయడం, వ్యవసాయం చేయడంతో పాటు రకరకాల రంగు రాళ్లతో ఆభరణాలు చేసి చుట్టు పక్కల వూర్లకు వచ్చే టూరిస్టులకు అమ్ముతుంటారు. వృద్ధులు, కాస్త సామాజిక చైతన్యం ఉన్న మహిళలు తోటి మహిళలకు బాల్య వివాహాలు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు.

తుపాకీతో కాపలా ఉంటారు !
సిరియా అంటేనే యుద్ధానికి పెట్టింది పేరు. ఇక్కడ ఎప్పుడూ హింసాత్మక వాతావరణమే నెలకొని ఉంటుంది. ఈ క్రమంలో ఎందరో సైనికులు తమ ప్రాణాలను కోల్పోతుంటారు. అలా యుద్ధంలో భర్తలను కోల్పోయిన స్త్రీల కోసం, అనాథగా ఉన్న స్త్రీల కోసం 'జిన్వార్' అనే ఊరిని ప్రత్యేకంగా నిర్మించాయి మహిళా సంఘాలు. 2018లో పూర్త్తెయిన ఈ ఊరిని మహిళలపై హింసకు వ్యతిరేకంగా నవంబరు 25న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం నాడు ప్రారంభించారు. మహిళలను, పిల్లలను హింస నుండి దూరంగా ఉంచడానికి కెన్యాలోని ఉమోజ గ్రామాన్నే ఇక్కడ స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ఈ ఊరిలోకి పురుషులెవరూ రాకుండా గేటు బయట ఒక మహిళ తుపాకీతో కాపలా కాస్తుంటుంది కూడా.
30 కుటుంబాలు నివసించే ఈ ఊరిలో పిల్లలకు ఒక పాఠశాల, జిన్వార్ అకాడమీ, మ్యూజియం ఇంకా ఒక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడి మహిళలు స్వయంగా వ్యవసాయం, పశువుల పెంపకం చేపడుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఉదయం అల్పాహారం దగ్గర నుండి సాయంత్రం భోజనం వరకు ఇక్కడ అందరూ కలిసే చేయడం మరో విశేషం.

ఒంటరి మహిళల కోసం..
ఈజిప్టు ప్రభుత్వం వితంతువులకు, విడాకులు తీసుకున్న వారికి కేటాయించిన ఊరే 'అల్ సమాహా'. ఇక్కడ మూడొందల మందికి పైగా మహిళలు తమ పిల్లలతో జీవనం సాగిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి ఇచ్చిన ఇంటిని, వ్యవసాయ భూమిని తిరిగి తీసుకుంటుందట ఇక్కడి ప్రభుత్వం. ఎలాంటి ఆసరా లేని ఒంటరి మహిళలు మాత్రమే ఇక్కడ నివసించాలనేది ప్రభుత్వ నిబంధన. పలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అన్ని విధాలా అర్హులైన వారికి ఒక ఇంటితో పాటు ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయిస్తుంది. అంతేకాదు ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువుని, వ్యవసాయానికి కావలసిన ప్రతి ముడి సరుకుని ప్రభుత్వమే ఇస్తుందట.

ఒక దీవినే సృష్టించింది !
ఆమె ఒక వ్యాపారవేత్త. పేరు క్రిస్టినా రోత్. వ్యాపారవేత్త కాకముందు పలు సంస్థలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేది. ఆ సమయంలో మగవారి ఆజ్ఞలకు తలాడించాల్సి రావడం ఆమెకు నచ్చలేదట. అందుకే తాను నెలకొల్పిన సంస్థను అమ్మేసి తనలాంటి మహిళల కోసం ఏకంగా ఒక దీవినే కొనేసింది. ఈ దీవి పేరే 'సూపర్ షీ ఐల్యాండ్'.
మహిళలు సరదాగా కాలం గడిపే ఈ దీవిలో మగవారికి ప్రవేశం లేదు. ఇక్కడ మగవారు ప్రవేశించింది కేవలం దీవి నిర్మాణ సమయంలోనే. ఈ దీవిలో మహిళలు యోగా, మెడిటేషన్, సాహసకృత్యాలతో పాటు స్ఫూర్తి ప్రసంగాలను ఇస్తుంటారు. అయితే ఈ దీవి బాగా సంపన్న మహిళలకే అందుబాటులో ఉందని, పైగా ఇందులో ప్రవేశం కోసం జరిగే సెలక్షన్స్లో కఠిన నియమాలతో పాటు నాలుగువేల యూరోల భారీ మొత్తాన్ని వసూలు చేయడం విమర్శలకు దారితీసింది.

కొడుకైనా వెళ్లిపోవాల్సిందే !
'నొయివా డు కోర్డియొరొ' ఇది బ్రెజిల్లోని ఒక ఊరు. గతంలో ఇక్కడ వితంతువులు, అనాథ మహిళలు, పెళ్లి కాని మహిళలు ఎక్కువగా ఉండేవారట. తాము చెప్పిన నియమనిబంధనలకు ఒప్పుకుంటేనే మగవారిని ఊరిలో ఉండనిచ్చేవారట. అది కూడా వీకెండ్స్లో మాత్రమే ! మిగిలిన రోజులన్నీ ఎక్కడికైనా వెళ్లి పని చేసుకుంటూ ఉండాల్సిందే. ఆఖరుకి సొంత కుమారులైనా పద్దెనిమిదేళ్లు దాటితే ఊరి నుండి వెళ్లిపోవాల్సిందేనట. ప్రస్తుతం ఇక్కడ 20 నుండి 35 సంవత్సరాల వయసుండే ఆరు వందల మహిళలు మాత్రమే జీవిస్తుండడం విశేషం.

ఐక్యరాజ్య సమితి మెచ్చుకుంది !
యూరప్లోని బాల్టిక్ నదిలో ఉంది 'కిహ్ను' అనే దీవి. దీని అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని స్థానికులు చెబుతుంటారు. దీనంతటికీ కారణం ఇక్కడి మహిళల నిర్వహణ సామర్థ్యమే. దాదాపు ఆరు వందలకు పైగా ఉండే ఇక్కడి జనాభాలో మహిళలే ఎక్కువ కాగా, అధికారం మొత్తం వారి చేతిలోనే ఉంటుందట. ఇక్కడి మగవారు నెలల తరబడి చేపల వేటకు వెళ్లడం వల్ల పిల్లల ఆలనా పాలనా దగ్గర నుండి ఊరిలోని అన్ని విషయాలను మహిళలే చూసుకుంటుంటారు. అందుకే ఈ ప్రాంతం సంస్కృతీ సంప్రదాయాలతో అలరారుతుంటుంది. ఈనేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి 'కిహ్ను'ని మాటలకందని వారసత్వ సంపదగా అభివర్ణించింది.