మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపలా స్నేహితురాలి ఇంటికి వెళ్లొద్దామని బయలుదేరింది కార్తీక. దారి మధ్యలోనే తేన్పులు రావడం మొదలయ్యాయి. భోజనం తర్వాత ఇలా తేన్పులు రావడం సాధారణ విషయమే కదా అని ఆమె అంతగా పట్టించుకోలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఆ తేన్పులు తగ్గకపోగా, ఇంకా ఎక్కువయ్యాయి. ఇలా ఏ పనీ చేయనీయకుండా, నలుగురిలో ఇబ్బందిపెట్టే తేన్పుల సమస్యకు చెక్ పెట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఓసారి చూద్దామా..

అల్లం
జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, తేన్పులను ఇది తక్షణమే నివారిస్తుంది. ఇందులో శరీరంలోని విషవాయువులను పోగొట్టే ఔషధ గుణాలు ఉండడమే దీనికి కారణం. రోజుకు రెండు లేదా మూడు సార్లు చిన్న అల్లం ముక్కను తీసుకోవడం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అల్లాన్ని ఇలా నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు తేనె లేదా పంచదారతో కలిపి తీసుకోవచ్చు. మరో ప్రత్యామ్నాయ పద్ధతేంటంటే.. ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఓ పదినిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంతవరకు ఆగి, అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకొని తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.

బొప్పాయి
చర్మ ఆరోగ్యానికి, అందానికి చక్కటి ఔషధంలా పనిచేయడమే కాకుండా తేన్పుల సమస్య నుంచి బయటపడేయడంలోనూ బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ, గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

పెరుగు
పాలల్లో కంటే పెరుగులో ఔషధగుణాలు ఎక్కువని ఇప్పటికే చాలా పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. నిత్యం మనకు అందుబాటులో ఉండే పెరుగుతో తేన్పుల సమస్యను కూడా ఇట్టే తగ్గించుకోవచ్చు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, తేన్పులతో పాటు ఇతర ఉదర సంబంధిత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తులు పడనివారు పెరుగును తీసుకోవడం వల్ల పాల నుంచి అందాల్సిన పోషకాలు అందుతాయి.

సోంపు గింజలు
భోజనం తర్వాత సోంపు గింజలను తీసుకోవడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న పద్ధతి. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుందనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ సోంపుగింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ గింజల్లో శరీరం నుంచి విషవాయువులను పోగొట్టే లక్షణాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, కడుపుబ్బరం, తేన్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపు గింజలను నేరుగా తీసుకోవడం మంచి పద్ధతి. ఇలా వీలుకాని వారు ఒక కప్పు నీళ్లలో బరకగా దంచుకున్న సోంపు గింజలను వేసి, కాసేపు మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తీసుకుంటే తేన్పుల సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఇలా రోజూ రెండు సార్లు తీసుకోవచ్చు.

పుదీనా..
జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో పుదీనా సైతం సమర్థంగా పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరం, అధిక తేన్పుల సమస్యతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సిన సహజ ఔషధం ఇది. ఈ ఆకులను నమలడం వల్ల జీర్ణాశయంలో పైత్యరసం అధికంగా ఉత్పత్తి అయి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. లేదంటే ఒక టేబుల్స్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు నీళ్లలో వేసి, బాగా మరగబెట్టండి. ఈ ద్రావణాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే సరి.
ఇవి కూడా..
* తేన్పుల సమస్య అధికంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే రెండు లేదా మూడు యాలకులను కొద్దిసేపు బాగా నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకుల్లో జీర్ణరసాలను ఉత్పత్తి చేసే గుణాలుండడమే దీనికి కారణం.
* ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలకు అంతే పరిమాణంలో జీలకర్రను జతచేసి, కాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* ఒక టేబుల్స్పూన్ ఇంగువకు కొన్ని సోంపుగింజలను జతచేసి పొడిచేయాలి. తేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ పొడిని కొద్దిగా తీసుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది.
* ఒక కప్పు చల్లని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ బేకింగ్ సాడా కలిపి, ఈ ద్రావణాన్ని భోజనం తర్వాత తీసుకుంటే తేన్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చు.