ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం కీలక మలుపు. అందుకే ఆ రోజు అందంగా.. అందరిలోనూ ప్రత్యేకంగా, మరింత ఆకర్షణీయంగా మెరిసిపోవాలని నవవధువులు కోరుకొంటారు. అయితే ఎంత బాగా రడీ అయినప్పటికీ కొంతమంది ముఖంపై ఉన్న మొటిమలు లేదా ఇతర కారణాల వల్ల ఏర్పడిన మచ్చలు ఆ అందాన్ని తగ్గిస్తాయి. మరి, వివాహానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ మచ్చలని తగ్గించుకోవచ్చు. దీనికోసం ఇంట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

నారింజ తొక్కలతో..
* నారింజ తొక్కలో రెటినాల్, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు మేనిఛాయను సైతం పెంచుతాయి. దీనికోసం నారింజ తొక్కలను తురిమి దానితో ముఖాన్ని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.
* నారింజ తొక్కలను తీసుకొని వాటిని రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. దీనిలో కొంత భాగాన్ని తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్స్పూన్ల నీటిలో కాస్త పలుచగా ఉండేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. దీన్ని వారంలో రెండు సార్లు చేయడం ద్వారా ముఖం అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

నిమ్మ..
నిమ్మ కూడా ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ 'సి' మచ్చలనే కాదు.. చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డుని కూడా తొలగిస్తుంది. ఇందుకోసం నిమ్మ రసాన్ని గిన్నెలోకి తీసుకొని, దీనిలో దూది ఉండను ముంచాలి. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడిన చోట మృదువుగా రుద్ది 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే మచ్చలు తగ్గుముఖం పడతాయి.

పెరుగుతో..
* ముఖంపై డార్క్ ప్యాచెస్ ఉన్నట్లయితే వాటిని పెరుగు సాయంతో పోగొట్టుకోవచ్చు. పెరుగుని ప్యాచెస్ ఉన్న చోట రాసి 20-30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
* పెరుగుతో తయారుచేసిన ఫేస్ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు. దీనికోసం టేబుల్స్పూన్ పెరుగు, రెండు టేబుల్స్పూన్ల ఓట్స్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అలాగే రోజ్వాటర్, తేనె, పెరుగు కలిపి మిశ్రమంగా చేసుకొని దాన్ని కూడా ఫేస్ప్యాక్లాగా ఉపయోగించుకోవచ్చు.
* మజ్జిగతో సైతం ముఖంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టవచ్చు. గిన్నెలో నాలుగు చెంచాల మజ్జిగ వేయాలి. దానికి రెండు చెంచాల టమాటా రసం కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దాన్ని పూర్తిగా ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేయడం ద్వారా మచ్చలను తగ్గించుకోవచ్చు.

బంగాళాదుంపతో..
బంగాళాదుంపల్లో సహజ బ్లీచ్ లక్షణాలుంటాయి. ఇవి ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను చర్మం రంగులో కలిపేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి బంగాళాదుంపను శుభ్రంగా కడిగి పొట్టు తీసి దాన్ని తురుముకోవాలి. ఆ తర్వాత దీనిపై కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారంలో మూడు రోజులు పాటిస్తే.. ముఖంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
గంధంతో..
* మొటిమలు, కొన్ని రకాల చర్మ ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడిన మచ్చలను గంధం సాయంతో సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం గంధపు చెక్కను రోజ్వాటర్తో అరగదీయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి వేళల్లో మచ్చలున్న చోట రాసి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేస్తే సరిపోతుంది.
* రోజ్వాటర్లో గంధం అరగదీసి దానికి కొన్ని చుక్కల గ్లిజరిన్ను కలిపి మచ్చలున్న చోట అప్త్లె చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.

దాల్చిన చెక్కతో..
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలను పోగొడతాయి. ఈ ఫలితం కోసం దాల్చిన చెక్క పొడిని తీసుకొని దానిలో కొద్దిగా రోజ్వాటర్, కాసిన్ని నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్లా తయారుచేసుకోవాలి. దీన్ని మచ్చలున్న చోట రాసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

ద్రాక్షపళ్లతో..
ద్రాక్షపళ్లలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలుంటాయి. ఇవి స్కిన్టోన్ని పెంచడం మాత్రమే కాకుండా మచ్చలను సైతం తగ్గిస్తాయి దీనికోసం ద్రాక్షరసాన్ని ప్రతిరోజూ నిద్రపోయే ముందు మచ్చలున్న చోట రాసుకొని మరుసటి రోజు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.